పవిత్ర గంగానదిలో ఇఫ్తార్ విందు, నీటిలో చికెన్ ముక్కలు.. 14 మంది అరెస్టు

  • బోటులో ఇఫ్తార్ ఏర్పాటు చేసి మిగిలిన చికెన్‌ను నీటిలో విసిరిన నిందితులు
  • హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఫిర్యాదు
  • వివిధ సెక్షన్ల కింద 14 మందిని అరెస్టు చేసిన పోలీసులు
వారణాసిలో పవిత్ర గంగానదిలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి, చికెన్ బిర్యానీ తింటున్న ఒక వీడియో వైరల్ కావడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. మతపరమైన మనోభావాలు దెబ్బతీయడంతో పాటు, పుణ్యస్థలాన్ని అపవిత్రం చేశారనే ఆరోపణలపై పోలీసులు 14 మంది యువకులను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి బీజేపీ యువ మోర్చా నగర విభాగం అధ్యక్షుడు రజత్ జైశ్వాల్ ఫిర్యాదు చేయడంతో కోత్వాలీ పోలీసులు కేసు నమోదు చేశారు.

గంగానదిలో ఒక పడవలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడంతో పాటు చికెన్ బిర్యానీ తిన్నారని రజత్ జైశ్వాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బిర్యానీని తిన్న అనంతరం మిగిలిన ఆహారాన్ని గంగానదిలో పారవేయడం ద్వారా అపవిత్రం చేశారని తెలిపారు. హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

గంగానదిని హిందువులు పవిత్రస్థలంగా కొలుస్తారని, దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాదిమంది హిందువులు గంగాజలంతో పూజలు, ప్రార్థనలు చేస్తారని గుర్తు చేశారు. ఇలాంటి పవిత్ర నదిలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి, మిగిలిన చికెన్‌ను గంగలో పారబోశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

బీఎన్ఎస్ సెక్షన్లు 298 (ఒక మతాన్ని అవమానించే ఉద్దేశ్యంతో పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేయడం), 299 (మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యంతో చర్యలకు పాల్పడటం), 196(1) బి (మతం, జాతి, ప్రాంతం మొదలైన కారణాలతో వర్గాల మధ్య వైరుధ్యాలు పెంచే ప్రయత్నం చేయడం), 270, (ప్రజలకు ఇబ్బంది కలిగించటం), 279 (నీటిని కలుషితం చేయడం) తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. గంగానదిలో ఒక పడవలో కొందరు వ్యక్తులు ఇఫ్తార్ విందు చేసుకుంటూ బిర్యానీ తింటున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ అయిందని ఏసీపీ విజయ్ ప్రతాప్ సింగ్ తెలిపారు.

Ganga River
Iftar party
Varanasi
Uttar Pradesh Police
Chicken Biryani
Religious sentiments
Rajat Jaiswal

More Telugu News